
హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకురాలు, సినీనటి విజయనిర్మల (73) కన్నుమూశారు. ఆమె వయస్సు 73 ఏళ్లు. హైదారాబాదులోని గచ్చిబౌలిలో గల కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి. గచ్చిబౌలి పరిధిలోని నానక్ రామ్ గూడలో నివాసం ఉంటున్న విజయనిర్మల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో జన్మించారు. తొలి తెలుగు మహిళా దర్శకురాలు విజయనిర్మల. 2002లో గిన్నీస్ బుక్లో ఆమె పేరు చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. 2009 వరకు 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె సినిమాలు తీశారు. ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది.దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలు ఆమె దర్శకత్వంలో తెరకెక్కాయి. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 2009లో తీసిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం. నటుడు నరేశ్కు విజయనిర్మల తల్లి. ప్రముఖ సినీనటి జయసుధకు ఈమె పిన్ని. విజయనిర్మల మృతి తో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.