
హైదరాబాద్: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, శ్రావణ మాసం రావడంతో ఇకపై రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇప్పటి నుంచి పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యత మండల పరిధిలోని తహసీల్దార్కు అప్పగిస్తూ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలు కానుంది. దీంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం ఆదేశించింది. పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ.10 నాన్ జ్యూడీషియల్ స్టాంప్పై అఫిడవిట్ను తహసీల్దారుకు అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం జీఓలో తెలిపింది.