
హైదరాబాద్, నిఘా24: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. కాగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసి యాక్ట్, 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రచార ముగింపు నిబంధన అమలులోకి వచ్చిన అనంతరం డిసెంబర్ 1వ తేదీన ఎన్నికల వరకు 48గంటల్లో ఆయా పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.