
హైదరాబాద్ : దుకాణాల ముందు సామాజిక దూరం పాటించే సర్కిల్ లు లేవు…,సామాజిక దూరం లేదు…, శానిటైజర్ లు లేవు…, దుకాణాల్లో సిబ్బంది చేతికి గ్లౌస్ లు లేవు…, కానీ చంతాడంత లైన్ లు.., లైన్లలో వందలకొద్ది ప్రజలు.., ముందుకు వెళ్లేందుకు తోపులాటలు… ఇది శేరిలింగంపల్లిలోని మద్యం దుకాణాల వద్ద పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలకు గేట్లు ఎత్తడమే ఆలస్యం బుధవారం ఉదయం నుంచే శేరిలింగంపల్లి లోని మద్యం దుకాణాల ముందు ప్రజలు బరులుతీరారు. కొన్ని దుకాణాలు ప్రభుత్వ నిబంధనలు పాటించినా, కొన్ని మాత్రం బేఖాతరు చేశాయి. ఐదుగురు మాత్రమే ఉండి, మిగిలిన వారు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు తెలిపిన నిబంధనలను తుంగలో తొక్కారు. గోపనపల్లి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఓ వైన్స్ ముందు లైన్ లో నిలబడిన వారు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసి తొలుకుంటున్న పరిస్థితి కనిపించింది. దీనికి తోడు దుకాణం ముందు సర్కిల్స్ ఏర్పాటు చేయకుండా, షాప్ లో సానిటైజర్ లు ఏర్పాటు చేయకుండా, కనీసం సిబ్బంది సైతం జాగ్రత్తలు పాటించకుండా మద్యం విక్రయాలు చేపట్టారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, అధికారులు ఈ విషయాల మీద ఏ మేరకు దృష్టి సారిస్తారో చూడాలి. వీటికి తోడు సందట్లో సందుగా ప్రభుత్వ నిర్ణిత ధరపై 100 రూపాయల వరకు ఎక్కువ తీసుకుంటున్నారని పలువురు వాపోయారు.
