
హైదరాబాద్: మీ సెల్ ఫోన్, ఐ ప్యాడ్, లాప్ టాప్ ల ఛార్జింగ్ అయిపోతే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్ల వద్ద ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా… అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. షాపింగ్ మాల్స్, ఆఫీసులు, బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసున్నాయి. వీటినే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు “జ్యూస్ జాకింగ్ “తో రెచ్చిపోతున్నారు.
జ్యూస్జాకింగ్….
సులభంగా చెప్పాలంటే గ్లాసులో ఉన్న పళ్ల రసాన్ని స్ట్రాతో జుర్రుకున్నట్లే ఎలక్ట్రానిక్ ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్బీ పోర్టు ద్వారా కొట్టేయడం అన్నమాట. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఛార్జింగ్ కియోస్క్ లో నాలుగైదు యూఎస్బీ కేబుల్స్ ఉంటాయి. మీరు ఫోన్, ల్యాప్టాప్ వంటివి వాటికి కనెక్ట్ చేస్తే చాలు ఛార్జింగ్ అవుతుంది. ఇలాంటి కేంద్రాల్లోకి ఇప్పుడు సైబర్ నేరగాళ్లు చొరబడుతున్నారు. ఛార్జింగ్ కోసం అమర్చిన యూఎస్బీ పోర్టును మార్చేస్తున్నారు. దాని స్థానంలో అచ్చం అలాగే ఉండేలా సొంతంగా తయారుచేసిన పోర్టును అమరుస్తున్నారు. ఎవరైనా తమ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఛార్జింగ్ చేసుకునేందుకు వీటికి కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ కావడం మొదలవుతుంది. అదే సమయంలో మన స్మార్ట్ ఫోన్, ఐ ప్యాడ్, లాప్ టాప్ లోని సమాచారమంతటినీ యూఎస్బీ పోర్టు తస్కరిస్తుంది.
ఎలా జరుగుతుంది..
ఏ స్మార్ట్ఫోన్లో అయినా ఛార్జింగ్, సమాచార మార్పిడికి వేర్వేరు పోర్టులు లేవు. దీన్నే నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని జ్యూస్ జాకింగ్కు తెర లేపారు. ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు అదే కేబుల్ ద్వారా సమాచారం తస్కరిస్తున్నారు. ఎవరైనా ఛార్జింగ్ చేసుకునేందుకు తమ ఫోన్ ను బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఛార్జింగ్ పాయింట్ కు కనెక్ట్ చేయగానే మన ఫోన్ లోని సమాచారం మొత్తం గల్లంతవుతుంది. తస్కరించిన సమాచారమంతా యూఎస్బీ పోర్టులో నిల్వ అయిన తర్వాత దాన్ని తీసుకుని ఆ డేటాను సంగ్రహిస్తున్నారు. లేదంటే బ్లూటూత్కు అనుసంధానించి అందులో ఉన్న సమాచారాన్ని తమ దగ్గరున్న పరికరంలోకి బదిలీ చేసుకుంటున్నారు.
బెదిరింపులు…
ఒక్కసారి ఈ సమాచారం చేతికి చిక్కిన తర్వాత ఫోన్ యజమానిని బెదిరించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది తమ బ్యాంకు ఖాతా వివరాలు పిన్ నెంబర్లు సహా ఫోన్లో దాచుకుంటున్నారు. ఈ డేటా దొరకగానే నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
లేదంటే ఫోన్లో ఉన్న వ్యక్తిగత విషయాలు బయట పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
పరిష్కారం…
వీలైనంత వరకూ పవర్బ్యాంకు దగ్గర పెట్టుకోవాలి. తద్వారా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు.
బహిరంగ ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఛార్జింగ్ చేసుకునేటప్పుడు వాటిని స్విచాఫ్ చేయాలి.
ఛార్జింగ్ పెట్టేటప్పుడు సమాచార బదిలీ (డేటా ట్రాన్స్ఫర్) ఆప్షన్ను ఆఫ్ చేయాలి. వీలైనంత వరకూ బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ చేసుకోకుండా ఉండాలి. బ్యాటరీని జాగ్రత్తగా, అవసరం కోసం మాత్రమే వాడుకుంటే ఇలా ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.
